జార్ఖండ్ బీజేపీ చీఫ్ తలా మరాండీ వివాదంలో చిక్కుకున్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెను వివాదంలో చిక్కుకుంది. కమలం పార్టీకి చెందిన జార్ఖండ్ శాఖ చీఫ్ తలా మరాండీ చేసిన ఈ పని ఆ పార్టీకి మచ్చ తెచ్చింది. ఈయన చేసిన పని సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముక్కుపచ్చలారని 11 ఏళ్ల బాలికతో ఆయన తన కొడుకు మున్నా మరాండీకి వివాహం చేశారు.
జూన్ 27న జరిగిన ఈ వివాహం జరుగగా.. 29న రిసెప్షెన్ను ఘనంగా నిర్వహించారు. ఈ బాలిక వయస్సును పరిశీలించగా.. 2005, జూలై 25న ఆ బాలిక జన్మించిందని స్కూల్ రికార్డులలో తేలింది. అంతేకాదు మరోపక్క 11 ఏళ్ల బాలిక బంధువును మున్నాను వివాహం చేసుకోవాల్సిఉండగా.. చివరి నిమిషంలో ఏమైందో ఏమోగాని ఉన్నట్టుండి ఏకంగా పెళ్లి కూతురునే మార్చేశాడు.
ఓ వైపు ''మోడీ బేటీ బచావో..బేటీ పడావో'' మంత్రాన్ని చెబుతుంటే.. ఇలా బీజేపీ నేతలు మైనర్ బాలికలను వివాహం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జాతీయ మహిళా కమిషన్ ఈ వ్యవహారంలో కలగజేసుకోవాలని శోభా ఓజా కోరారు.