కోల్కతాలో జరిగిన మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన సెక్యులర్ పార్టీలు ఏకతాటిమీదకు వచ్చి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని, బీజేపీ, ఆరెస్సెస్ను కేంద్రం నుంచి తప్పించాలని పిలుపునిచ్చారు.
సకాలంలో మేలుకొని సమైక్యం కాకపోతే మతవాద శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయని హెచ్చరించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా ఇదేతరహా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పైగా ఫ్రంట్కు మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తే బాగుంటుందని సూచించారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా ప్రాంతీయ పార్టీల కూటమి పోటీకి దిగుతుందేమో అనే ఊహాగానాలు జరుగుతున్నాయి. మొట్టమొదటి బెంగాలీ ప్రధానమంత్రి కాబోతున్నారా అని మీడియా అడిగితే మమత, నేను సామాన్యురాలిని అంటూ సమాధానం దాటవేశారు.