మతం మార్చుకుంటేనే కాపురం చేస్తా.. లేదంటే విడాకులే : పాట్నాలో లవ్ జిహాద్

బుధవారం, 14 అక్టోబరు 2020 (15:15 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో లవ్ జిహాద్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ళ క్రితం హిందూ మతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఇపుడు మతం మార్చుకుంటేనే కాపురం చేస్తానని లేకుంటే విడాకులు ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆ యువతి.. ధైర్యం చేసి రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని ముంగేర్ ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువకుడు, పాట్నాలో నివాసముండే హిందూ మతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో భార్యను మతం మార్చుకోవాలని చెప్పలేదు. ప్రస్తుతం మతం మార్చుకోనిపక్షంలో తనతో ఉండేందుకు నిరాకరించాడు. 
 
మతమార్పిడి కోసం భర్తతో పాటు అతడి తల్లి కూడా ఒత్తిడి తెచ్చింది. పాట్నా విశ్వవిద్యాలయంలో బీఈడ్ చదువుతున్న సమయంలో కలిగిన స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల వారు వ్యతిరేకించినా వివాహం చేసుకున్నారు. 
 
గత కొంతకాలంగా శారీరకంగా దాడి చేయడం, ఆహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో సహనం నశించిన సదరు యువతి బీహార్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలంటూ పిటిషన్‌ పెట్టుకున్నది. 
 
ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ దిల్మానీ మిశ్రా చెప్పారు. ఇద్దరూ కోర్టు సమక్షంలో వివాహం చేసుకున్నందున వారికి ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ నిర్ణయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు