రాజ్యాంగ సూత్రాలకు స్థిరంగా కట్టుబడివుండాలి : రాష్ట్రపతి ప్రణబ్

బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (09:58 IST)
రాజ్యాంగ సూత్రాలకు స్థిరంగా కట్టుబడి ఉన్నపుడే దేశం దినదినాభివృద్ధి సాధించగలుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అందువల్ల రాజ్యాంగ పదవులు నిర్వహించేవారంతా రాజ్యాంగ పవిత్రతను కాపాడేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం మన ఆకాంక్షల్ని, వాటిని సమిష్టిగా నెరవేర్చుకునే అవకాశాల్ని ప్రతిబింభించే పత్రమన్నారు. 
 
రాష్ట్రపతిభవన్‌లో రెండురోజుల గవర్నర్ల మహాసభను ప్రారంభిస్తూ, రాజ్యాంగ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవులు నిర్వహించే మనందరి మీదా ఉంది అని రాష్ట్రపతి గుర్తు చేశారు. గవర్నర్ల పాత్రపై, ముఖ్యంగా అరుణాచల్ గవర్నర్ రాజ్‌ఖోవా నిర్ణయాలపై అనేక వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. 
 
సరిహద్దులకావల అస్థిర భద్రతా పరిస్థితుల కారణంగా మన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉందని ఆయన నొక్కివక్కాణించారు. అయితే అన్ని అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వరుసగా రెండేండ్లు కరువు రావడంతో దేశ తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నదని గుర్తు చేశారు. మరోసారి వర్షాలు కురవకపోతే వ్యవసాయంపై మరింత ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మేకిన్ ఇండియా, స్టార్టప్, స్మార్ట్ సిటీస్ వంటి పథకాలు విజయవంతం కావాలంటే రాష్ట్రప్రభుత్వాల సన్నిహిత సహకారం అవసరమని రాష్ట్రపతి అన్నారు. తమతమ రాష్ట్రా రాజ్యాంగాధిపతులుగా గవర్నర్లు ఈ దిశగా ప్రోత్సాహం కలిగించాలన్నారు. విద్యాసంస్థల నాణ్యత పెంచడంలోనూ గవర్నర్లు కీలకపాత్ర పోషించవచ్చన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. 

వెబ్దునియా పై చదవండి