ట్రాఫిక్ సిగ్నల్స్‌పై లింగ సమానత్వం... ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు.. ఎక్కడ?

సోమవారం, 10 ఆగస్టు 2020 (10:53 IST)
ప్రపంచ వ్యాప్తంగా మహిళలు లింగ సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం మహిళలు విజయం సాధించగలిగారుకానీ, ముస్లిం దేశాల్లో మాత్రం ఇది ఎండమావిగానే మారిపోయింది. ఈ నేపథ్యంలో సమాజంలోనే కాకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్‌లో కూడా లింగ సమానత్వాన్ని ఆ మహానగర పోలీసులు కల్పించారు. ఆ మహానగరం ఎక్కడో లేదు.. మన దేశంలోనే. దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌పై కూడా లింగ సమానత్వం చూపించారు. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్‌పై మహిళల సింబల్‌ను ఏర్పాటు చేస్తూ, ముంబై ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 
 
నగరవ్యాప్తంగా 120 సిగ్నల్స్ వద్ద అధికారులు మహిళల సింబల్స్‌ను ఏర్పాటు చేశారు. దాదర్, జీ నార్త్ వార్డ్ తదితర ప్రాంతాల్లో పురుషుల సిగ్నల్ బదులుగా మహిళలను సూచించే లైట్లు ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ స్వాగతిస్తున్నారు. 
 
బీఎంసీ (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) కల్చరల్ ప్రాజెక్టులో భాగంగా ఈ మార్పు చేశారు. పలు దేశాలు ముంబై తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు స్వాగతిస్తూ, తమ దేశాల్లోనూ అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి.
 
'నేను దాదర్ ప్రాంతంలో వెళుతుంటే, లింగ సమానత్వాన్ని తెలిపే సింబల్ చూశాను. ఎంతో గర్వంగా అనిపించింది' అని మహారాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు. "ఓ శుభవార్త. ముంబైలో ట్రాఫిక్ లైట్లను మార్చారు. లింగ సమానత్వం దిశగా ఇండియా మరో అడుగు వేసింది" అని యునైటెడ్ నేషన్స్ ఉమెన్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు