అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ ఎలెన్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో భారత ప్రధానికి చోటు దక్కడం ఇదే తొలిసారి. గతేడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యలిద్దరూ ఈ ఏడాది జాబితాలో స్థానం కోల్పోయారు.
రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు, బ్యాంకర్లు, కార్పొరేట్ దిగ్గజాలు తదితరులో కూడుకున్న ఈ జాబితాలో రాజకీయ నేతలకు సంబంధించి మరో ముగ్గురు మాత్రమే మోడీ కంటే ఎగువన ఉన్నారు. వారిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జర్మనీ చాన్సెలర్ ఎంజెలా మెర్కెల్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్లు ఉన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన మోడీ, 30 ఏళ్ల తర్వాత భారత్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగారని ‘బ్లూమ్ బర్గ్’ పేర్కొంది.