ఆగస్టు 31తో ముగిసిన తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం

బుధవారం, 31 ఆగస్టు 2016 (17:31 IST)
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య (83) పదవీకాలం బుధవారం (ఆగస్టు 31)తో ముగిసింది. దీంతో ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
నిజానికి కె.రోశయ్య పదవీకాలం ముగియనుండడంతో ఆయన పదవీకాలం పొడిగిస్తారని, ఇదే అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాశారంటూ వార్తలు వెలువడిన సంగతితెలిసిందే. తాజా నిర్ణయంతో ఊహాగానాలకు తెరపడింది. 
 
దీంతో కె.రోశయ్య ఇకపై శేషజీవితాన్ని తన సొంతూరు చీరాలలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే వయోభారంతో బాధపడుతున్న రోశయ్య... సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి