కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరణ!

శుక్రవారం, 28 నవంబరు 2014 (09:51 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో బీజేపీ రథసారథి అమిత్ షా నిర్వహించతలపెట్టిన ర్యాలీకి ఆ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆదివారం చేపట్టనున్న ఈ ర్యాలీకి అనుమతించాలని పార్టీ చేసుకున్న దరఖాస్తును కార్పొరేషన్ గురువారం తిరస్కరించింది. దీంతో కోర్టు మెట్లెక్కేందుకు అమిత్ షా నిర్ణయించుకున్నారు. ర్యాలీపై తమ ఇంజినీర్లు వ్యక్తం చేసిన ఆందోళనలతోనే అనుమతి నిరాకరిస్తున్నట్లు కమిషనర్ ఖలీల్ అహ్మద్ బీజేపీకి సమాచారమందించారు. 
 
కమిషనర్ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర శాఖ భగ్గుమంది. తమ ప్రభంజనానికి జడిసిన తృణమూల్ సర్కారు కమిషనర్ చేత అనుమతి నిరాకరింపజేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకే కమిషనర్ అనుమతి నిరాకరించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించనున్నామని ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి