దిండుకింద ఫోన్ పెడుతున్నారా? కాస్త ఆలోచించండి..

సోమవారం, 9 నవంబరు 2020 (15:01 IST)
స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవని రోజులివి. నిద్రలేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు కూడా సెల్‌ఫోన్‌ ఓ వ్యాపకంలా మారింది. నిద్రించే సమయంలో కూడా చేతికి అందేలా పెట్టుకుని నిద్రపోయే వారి సంఖ్య అధికం. మరికొందరైతే దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. చాలామంది దిండు కింద పెట్టుకుని నిద్రపోతుంటారు.  ఈ అలవాటే ఓ వ్యక్తికి ప్రాణాల మీదకు తెచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాంకి చెందిన ఓ వ్యక్తి తన ఫోనును దిండు కింద పెట్టుకుని నిద్రించాడు. అది ఒక్కసారిగా పేలడంతో అతడి భుజం, ఎడమ చేతికి గాయాలయ్యాయి. డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన తాను.. బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నానని, ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కి పడి లేచే సమయంలో భుజం ఒక్కసారిగా నొప్పి చేసిందని, దిండు కాలిపోతూ.. ఫోన్‌ నుండి నిప్పులు చెలరేగాయని బాధితుడు చెప్పాడు. 
 
దీంతో ఫోన్‌ను దూరంగా విసిరేసి.. తాను ఆసుపత్రికి వెళ్లినట్లు వెల్లడించాడు. నిద్రపోయే సమయంలో ఫోన్‌ను దిండు కింద పెట్టానని, చార్జింగ్‌ కూడా పెట్టలేదని, కానీ బ్యాటరీ ఉబ్బిపోయి ఉందని బాధితుడు పేర్కొన్నాడు. ఆ ఫోన్‌ నోకియాకు చెందినదని.. ఎందుకు పేలిందో గుర్తించి... సమస్యను పరిష్కరించాలని బాధితుడు కోరుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు