కాంగ్రెస్ పార్టీలో ఫైవ్‌స్టార్ కల్చర్ పెరిగిపోయింది... గులాం నబీ ఆజాద్

సోమవారం, 23 నవంబరు 2020 (07:17 IST)
కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిపోయిందన్నారు. పార్టీ నేతల్లో ఫైవ్ స్టార్ కల్చర్ బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీని గ్రామీణ, మండల స్థాయి నుంచి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. 
 
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై లేఖాస్త్రం సంధించిన పార్టీ సీనియర్ నేతల్లో ఆజాద్ కూడా ఒకరు. ఇపుడు ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోమారు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందన్నారు. పార్టీ పరిస్థితికి నాయకత్వాన్ని నిందించి ప్రయోజనం లేదన్నారు. 
 
'పంచాయతీ, మండల స్థాయి నుంచి పార్టీని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థలో ఎవరైనా నేత ఎన్నికైతే అది సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుత వ్యవస్థ వల్ల లాభం లేదు' అని తేల్చిపారేశారు. 
 
అలాగే, మరో సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలపై ఆజాద్ స్పందిస్తూ, ఇది నాయకత్వ సమస్య కాదన్నారు. 'నాయకుణ్ణి మార్చేస్తే మనం బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గెలిచేస్తామనుకుంటే పొరపాటు. 
 
వ్యవస్థను మార్చినప్పుడే ఇది సాధ్యం' అని చెప్పుకొచ్చారు. ప్రజలకు కాంగ్రెస్‌ నేతలకు మధ్య సంబంధం తెగిపోయిందన్నారు. నాయకులు ఫైవ్‌స్టార్‌ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు