ఆమెకు ఎవరు లేరు.. మృతదేహాన్ని ఎలా దహనం చేశారో తెలుసా? మంచానికి రెండు పొడవాటి?

శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:19 IST)
పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో.. భార్య శవాన్ని తన భుజాలపైనే ఏకంగా 12 కి.మీ వరకు ఓ భర్త మోసుకుంటూ వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన ఒడిస్సాలోనే ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది. తాజాగా ఒడిశాలోని అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతమైన కలహందీలోని కోక్సారా బ్లాక్లోని మహిమా పంచాయత్లో సావిత్రి జువాయిడ్ అనే మహిళ మృతిచెందింది. 
 
సవర కులానికి చెందిన సావిత్రి, గౌడ కులానికి చెందిన వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా సంసారజీవితాన్ని గడిపారు. కాగా కొన్ని నెలల క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత అనారోగ్యం బారినపడ్డ సావిత్రి కూడా మృతి చెందింది. తమకెవరూ బంధువులు లేకపోవడంతో ఆమెకు అంత్యక్రియలు జరపాలని సహాయం చేయాలని గ్రామస్థులను ఆమె కుటుంబ సభ్యులు కోరారు. 
 
అయితే, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని మంచానికి రెండు పొడవాటి వెదురు బొంగులు కట్టి ఆ మంచంపై పెట్టి, ఈడ్చుకుంటూ వెళ్లి దహనం చేశారు. దీనిని చూసిన కొంత మంది జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించడంతో ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశిస్తూ, కొంత మంది వ్యక్తులకు 2000 రూపాయలు ఇచ్చి పంపించారు.
 

వెబ్దునియా పై చదవండి