దేశ ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేసిన ప్రధాని మోడీ : రాహుల్ నిప్పులు

బుధవారం, 11 జనవరి 2017 (12:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ఆర్థిక వ్యవస్థనే నాశనం చేశారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ నాశనమైందని నిప్పులు చెరిగారు. కాంగ్రస్ ఆధ్వర్యంలో జరిగిన జన్ వేదన సమ్మేళన్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనలోనే 'అచ్చే దిన్' కనిపించిందని అన్నారు. తమ పార్టీ ప్రజల కోసం ఎన్నో త్యాగాలను చేసిందని తెలిపారు. ప్రజలంతా మోడీని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఇన్ని ఇబ్బందులకు ఎందుకు గురి చేశారని రాహుల్ ప్రధానిని ప్రశ్నించారు. 
 
తాము అడుగుతున్న ప్రశ్నలకు ఆయన్నుంచి సమాధానం రావడం లేదని, ప్రజలే అడగాలని తెలిపారు. ప్రజలను కష్టాల్లోకి నెట్టిన మోడీ, తమాషా చూస్తున్నారని విమర్శించారు. నోట్లను రద్దు చేయాలన్నది మోడీ వ్యక్తిగత నిర్ణయమేనని, దాని వల్ల వచ్చే కష్టాలను ముందుగా తెలుసుకోకుండా, కనీసం సరిపడినంత నోట్లను సిద్ధం చేసుకోకుండా హడావుడిగా నిర్ణయం ప్రకటించారని ఆరోపించారు. 
 
ఆర్ఎస్ఎస్‌తో మోడీ కలిసి భారత్‌ను బలహీనపర్చారని ఆరోపించారు. ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఓ అసమర్థ చర్యగా అభివర్ణించారు. మోడీ చర్యవల్ల ప్రపంచం మొత్తం ఆయనను చూసి నవ్వుతోందని రాహుల్ విమర్శించారు. స్వచ్ఛ భారత్ అన్నారు, కానీ ప్రధానికి చీపురు పట్టుకోవడం కూడా రావట్లేదని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దులో ఆర్బీఐ గవర్నర్‌ను ప్రధాని కనీసం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి