ఏకంగా 16 కిలోమీటర్లు కాలినడకన కొండగుట్టల్లో నడుచుకుంటూ వెళ్లి హిమాలయ సానువుల్లో పరమ పవిత్రమైన కేదార్నాథ్ దేవస్థానాన్ని చేరుకున్న విషయం తెల్సిందే. అక్కడ పరమ శివుడికి పూజలు చేశారు. నుదిటి నిండా గంధంతో కూడిన విభూతితో ఆలయం నుంచి బయటకు వచ్చారు. ఆలయంలోకి వెళ్లిన వెంటనే ‘తేజస్సు’, ధైర్యం తనను ఆవహించాయన్న భావన కలిగిందన్నారు.
తన గురించి తాను ఏమీ కోరుకోలేదన్నారు. ‘రెండు లక్ష్యాలతో కేదార్నాథ్ ఆలయానికి కాలినడకన వచ్చాను. మొట్టమొదట, రెండేళ్ల కిందట వెల్లువెత్తిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించడం. 2013లో కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం జరిగిందో కళ్లారా చూశాను. అందువల్ల, కేదార్నాథ్కు నేను హెలికాప్టర్లో వెళ్లినట్లయితే వారిని అగౌరవపరచినట్లు అవుతుందన్నారు. అప్పట్లో యాత్రికులు ఏ బాటలో అయితే వెళ్లారో అదే మార్గంలో నేను కూడా వెళ్లాలని అనుకున్నట్టు చెప్పారు.
ఇక రెండోది.. ఇక్కడ ఎంతోమంది విధులు నిర్వర్తిస్తున్నారు. మనుషులను, మన వస్తువులను మోస్తున్నారు. వాళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అత్యంత దారుణ విషాదం చోటుచేసుకోవడంతో భయాందోళనలతో ఉన్నారు కూడా. ఇక్కడికి రావడానికి యాత్రికులు కూడా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, నేను ఇక్కడికి నడిచి వస్తే, ఇక్కడ పని చేస్తున్న వారికి, ఇక్కడికి రావాలనుకునే యాత్రికులకు ఒక భరోసా వస్తుంది. వారిలోని భయాందోళనలు తగ్గుతాయన్నారు.