బీమా సొమ్ము కోసం హత్య చేయించుకున్నాడు... ఎక్కడ?

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (13:06 IST)
ఓ వ్యక్తికి చెందిన కుటుంబం పూర్తిగా అప్పులపాలైంది. ఆ అప్పుల నుంచి బయటపడే అవకాశాలేలేకుండా పోయింది. దీంతో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. తాను చనిపోతే వ్యక్తిగత బీమా సొమ్ముతో తన కుటుంబం అయినా కష్టాల కడలి నుంచి గట్టెక్కుతుందని భావించాడు. అంతే.. ఆ బీమా సొమ్ము కోసం హత్య చేయించుకున్నాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన బాల్బీర్ అనే వ్యక్తి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, వ్యాపారంలో ఆదాయం అంతంతమాత్రంగా రావడంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆయన 20 లక్షల రూపాయల మేరకు అప్పులు చేశాడు. పైగా, గత ఆరు నెలల నుంచి కుటుంబ పోషణ మరింత దారుణంగా తయారైంది.
 
దీంతో ఆయనకు దిక్కుతోచలేదు. తనను హత్య చేయించుకుంటే వచ్చే బీమా సొమ్ముతో తన కుటుంబం బాగుపడుతుందని భావించాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఇద్దరు కిరాయి హంతకులను పిలిపించి.. తనను హత్య చేయాలని రూ. 80 వేలు అందజేశాడు. రెండు రోజుల ముందు.. తనను ఎక్కడ హత్య చేయాలో ఆ ప్రాంతాన్ని హంతకులకు చూపించాడు. బాల్బీర్ చెప్పినట్టుగానే కిరాయి హంతకులు ఆయన్ను హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు