తెలుగు ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకు కేంద్ర హోంశాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ క్లాస్ పీకారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం కూడా జితేందర్ రెడ్డి పక్కనే కూర్చొన్నారు.
టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆయన పక్కనే కూర్చున్న టీడీపీ ఎంపీ తోట నరసింహం ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. దీంతో రాజ్నాథ్ కలుగజేసుకున్నారు. "పక్కపక్కనే కూర్చున్నారు. వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నారు. ఆ మాత్రం సమస్యను పరిష్కరించుకోలేరా? మీరే చర్చించుకుని ఏకాభిప్రాయానికి రండి" అంటూ ఆయన వారిద్దరికీ చెప్పడంతో వారు ఖంగుతిన్నారు.