తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్ పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన కోర్టును కోరారు.
ఈ బెయిల్ పిటీషన్ విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేనందున విచారణ చేపట్టలేనని జస్టీస్ రత్నకళ వ్యాఖ్యానించగా.. ఆసమయంలో జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ ముందుకు వచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్పై విచారణ జరపవచ్చునని వాదించారు. అయితే ఈ వాదనను జస్టిస్ రత్నకళ అంగీకరించలేదు. మరోసారి రాం జెఠ్మలాని న్యాయమూర్తికి తన వాదన వినిపించారు.