షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాకు డైలులో చుక్కలు కనిపిస్తున్నాయి. కన్నకూతురినే హత్యచేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి, ప్రస్తుతం తనను జైలులో ఒంటరిగా వుంచొద్దని జైలు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. కార్పొరేట్ ఆఫీసు, లగ్జరీ కారు, ఇళ్లు, పార్టీ అంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇంద్రాణిని అనారోగ్య పరిస్థితుల రీత్యా వేరే సెల్కు తరలించనున్నట్లు సమాచారం.
కాగా జైలులో అపస్మారక స్థితిలో పడిపోయిన ఇంద్రాణిని గతవారంలో జేజే ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఓవర్ డోస్ యాంటీ-యాక్సిటీ మందుల్ని జైలు డాక్టర్లు ఇవ్వడంతోనే స్పృహ కోల్పోయానని.. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని ఇంద్రాణి జైలు అధికారులతో చెప్పింది. అయితే జైలు అధికారులు జేజే ఆస్పత్రి రిపోర్ట్ ఆధారంగా ఈ కేసును వేరే కోణంలో డీల్ చేయాలని భావిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అందే జేజే ఆస్పత్రి రిపోర్ట్ ద్వారానే ఇంద్రాణి జైలులో ఏకారణంతో స్పృహ తప్పిందని తెలియవస్తుందని జైలు అధికారులు అంటున్నారు.