జయ సమాధిపై శపథం చేసి బెంగుళూరుకు శశికళ పయనం... బేరసారాలకు దిగిన పన్నీర్ వర్గం

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:21 IST)
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరుకు బయల్దేరారు. పోయస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు ఆమె రోడ్డు మార్గంలో బయల్దేరారు. తొలుత మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధిని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం నేరుగా బెంగళూరు వెళ్లి, ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. అక్కడ నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహారం కేంద్ర కారాగారానికి ఆమెతోపాటు.. ఈ కేసులో శిక్ష పడిన ఇళవరి, సుధాకరన్‌లను తరలించనున్నారు. 
 
శశికళ పోయెస్ గార్డెన్‌కు బెంగుళూరుకు కదిలిందో లేదో... పన్నీర్ సెల్వం వర్గం రంగంలోకి దిగింది. ఇప్పటికీ రిసార్టులోనే ఉన్న పలువురు ఎమ్మెల్యేలను కలిసి వారు పునరాలోచించుకోవాలని కోరేందుకు పన్నీర్ సెల్వం వర్గ నేత, మంత్రి పాండ్యరాజన్ గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
శశికళ ఆదేశం మేరకు తీసుకున్న నిర్ణయాలను పక్కనబెట్టి, పన్నీర్ సెల్వంకు మద్దతు పలకాలని, ఐక్యంగా ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ఎమ్మెల్యేలకు ఆయన హితబోధ చేయనున్నారని సమాచారం. ముఖ్యంగా... పార్టీలో దివంగత జయలలిత నమ్మిన వ్యక్తి పన్నీర్ సెల్వమేనని వారికి గుర్తు చేసి, ఆయన వెనుకే నడుద్దామని పాండ్యరాజన్ కోరనున్నారు. 

వెబ్దునియా పై చదవండి