బీజేపీ కుట్ర చేస్తోంది.. అమ్మను కంటికి రెప్పలా కాపాడాం.. ఓపీనే సీఎం: శశికళ భర్త నటరాజన్

మంగళవారం, 17 జనవరి 2017 (11:07 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ నటరాజన్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని కాషాయమయం చేసేందుకు.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తంజావూరులో ఆరోపించారు.

అయితే బీజేపీ ఆటలను సాగనివ్వబోమని తెలిపారు. తాము కుటుంబ రాజకీయాలే చేస్తున్నామని ఇందులో ఎలాంటి దాపరికాలు లేవని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ మృతి తర్వాత జయలలితను కంటికి రెప్పలా తమ కుటుంబ సభ్యులే కాపాడారని అన్నారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సమర్థంగానే పనిచేస్తున్నారని, ఇప్పటికిప్పుడు ఆయనను మార్చే ఉద్దేశం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. 
 
శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలా? వద్దా? అనేది శాసనసభ్యుల నిర్ణయం ప్రకారం ఉంటుందన్నారు. ప్రస్తుతానికైతే పన్నీర్ సెల్వంను మార్చే ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలను కలిసి కట్టుగా అడ్డుకోవాలని కార్యకర్తలు, నాయకులకు నటరాజన్ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, ఎంజీఆర్‌ తర్వాత పార్టీని బలోపేతం చేసి ప్రత్యర్థులను జీవచ్ఛవాలుగా మార్చిన అమ్మ జయలలిత మరణాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్న వారి కుట్రలను తిప్పికొడతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి