ప్ర‌పంచ శాంతికి అతిపెద్ద విఘాతంగా రాడికలైజేషన్ : ప్రధాని మోడీ

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (16:02 IST)
షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు వర్చ్యువల్ విధానంలో శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో నానాటికీ పెరిగిపోతున్న తీవ్ర‌వాదం ప్ర‌పంచ శాంతికి అతిపెద్ద విఘాతంగా మారుతున్న‌ట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇటీవ‌ల ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించిన తాలిబ‌న్ల అంశాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ.. తీవ్ర‌వాదుల ఆగ‌డాల వ‌ల్ల ప్ర‌పంచ శాంతి దెబ్బ‌తింటోంద‌న్నారు. ప్రాంతీయ స్థిర‌త్వంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. గ్రూపులోని స‌భ్యులంతా కనెక్టివిటీ, న‌మ్మ‌కం లాంటి అంశాల‌పై ప‌ర‌స్ప‌రం ప‌నిచేయాల‌న్నారు. 
 
ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు అని, అక్క‌డ రాడిక‌లైజేష‌న్‌, తీవ్ర‌వాదం పెర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త‌ను ఎస్సీవో స‌భ్యులు నిర్వ‌ర్తించాల‌న్నారు. సెంట్ర‌ల్ ఏషియా చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే, అక్క‌డ ప్ర‌గ‌తిశీల సంస్కృతులు, విలువలు స‌మ్మిళితం అయ్యాయ‌న్నారు. కొన్ని శ‌తాబ్దాల పాటు సూఫిజం ఇక్క‌డ వ‌ర్ధిల్లింద‌ని గుర్తుచేశారు. 
 
మధ్య ఆసియాలో ఉన్న చారిత్ర‌క వార‌స‌త్వాన్ని ప‌రిశీలిస్తే, ఎస్సీవో స‌భ్యదేశాలు తీవ్ర‌వాదంపై క‌లిసి పోరోడాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇండియాతో పాటు అన్ని ఎస్సీవో స‌భ్య‌దేశాల్లో ఇస్లామ్‌తో అనుబంధం క‌లిగి ఉన్న ఎన్నో ఇన్స్‌టిట్యూష‌న్లు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. షాంఘై స‌హ‌కార సంస్థ 2001లో ఏర్పాటైంది. ఇందులో క‌జ‌కిస్తాన్‌, చైనా, కిర్గిస్తాన్‌, ర‌ష్యా, త‌జికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఇండియా, పాకిస్థాన్‌, ఇరాన్ స‌భ్య దేశాలుగా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు