అలాంటి సంబంధాలు అత్యాచార కేసులుగా పరిగణించరాదు : ఒరిస్సా హైకోర్టు

ఆదివారం, 24 మే 2020 (12:24 IST)
పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి, శారీరకంగా కలిసే కేసులను అత్యాచార కేసులుగా పరిగణించవద్దని ఒరిస్సా హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషనులో నమోదైన కేసులో భాగంగా, ఓ యువకుడు తనతో శారీరక సంబంధం పెట్టుకుని, పెళ్లికి నిరాకరించాడని యువతి కేసు పెట్టింది. విచారణ తర్వాత యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ హైకోర్టుకు రాగా, నిందితుడికి బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టుగా న్యాయమూర్తి తెలిపారు. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొంతమంది యువతీ యువకులు ప్రేమలో మునిగితేలుతున్నారు. అలాంటి వారిలో కొందరు యువకులు పెళ్లి చేసుకుంటామని నమ్మించి తమ ప్రియురాళ్ళతో ముందుగానే శారీరక సుఖం పొందుతున్నారు. ఆతర్వాత పెళ్లికి నిరాకరించడంతో కేసులు పెడుతున్నారు. ఇలాంటి వాటిని రేప్ కేసులుగా భావించలేం అని హైకోర్టు జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు