భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కొత్త ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం బరిలో నిలిచిన తమిళనాడు కమ్యూనిస్టు సీనియర్ నేత రామచంద్రన్ పిళ్లై అకస్మాత్తుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఈ పదవి కోసం దాఖలు చేసిన నామినేషన్ను పిళ్లై ఉపసంహరించుకున్నారు.
కాగా సీపీఎం 21వ జాతీయ మహాసభల చివరిరోజైన ఆదివారం విశాఖపట్నంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఇక్కడి ఆర్కే బీచ్లో కాళీమాత ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఈ సభకు లక్షమందికిపైగా హాజరవుతారని అంచనా. సభలో పార్టీ ప్రముఖులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, సీతారాం ఏచూరి, బృందాకారత్తోపాటు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు ప్రసంగిస్తారని తెలుస్తోంది.