నేపాల్ రాజధాని ఖాట్మండు కేంద్రంగా వచ్చిన భూప్రకంపనలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఆస్తి, ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. యూపీలో ఐదుగురు మరణించారు. బీహార్లో భగల్ పూర్ గోడ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు.
అలాగే, సీతామాడి, డర్భంగా, వైశాలిలో భవనాలు కూలడంతో ముగ్గురు మృతి చెందారు. చాలా చోట్ల భూప్రకంపనల వల్ల ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. అటు పశ్చిమబెంగాల్లో కూడా భూకంప తీవ్రతతో ఒకరు మరణించారు. జుల్పాయ్ గురి జిల్లాలో భవనం కూలడంతో పాణ్యసింగరాయ్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఉత్తర బెంగాల్లో పలుచోట్ల భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
మరోవైపు... శనివారం ఉదయం 11.56 గంటల సమయంలో 30 సెకన్ల నుంచి 2 నిమిషాల పాటు నేపాల్లో తొలిసారి భూమి కంపించింది. తరువాత కూడా మూడు గంటల వ్యవధిలో 13 సార్లు భూమి కంపించింది. నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైతే, చైనా రికార్డుల ప్రకారం 8.1గా నమోదైంది. ఖాట్మండుకు 80 కిలో మీటర్ల దూరంలోని లాంగ్ జామ్ను భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు.