ఇంటి పనిమనిషి కుమార్తెను కొనుగోలు చేసిన వ్యాపారవేత్త!!

గురువారం, 15 ఏప్రియల్ 2021 (10:44 IST)
భార్య అలిగి పుట్టింటికి పోవడంతో ఓ పారిశ్రామికవేత్త.. తన ఇంట్లో పాచిపనిచేసే మహిళ కుమార్తెను రూ.10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడు. చివరకు ఈ విషయం బహిర్గతం కావడంతో ఆయనతో పాటు.. కుమార్తెను విక్రయించిన తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సేలం అన్నాదానపట్టికి చెందిన సతీష్‌కుమార్‌(30), సుమతి (26) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. సుమతి కొన్నేళ్ల క్రితం చెన్నై నగరంలో ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ యజమాని కృష్ణన్‌ ఇంటిలో పనిమనిషిగా వుండేది. ఆ తర్వాత ఆమె స్వస్థలానికి తిరిగి వెళ్ళింది. ఆ తర్వాత కృష్ణన్‌ మనస్పర్థల కారణంగా భార్యను విడిచిపెట్టి ఒంటరిగా గడుపుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా సుమతి తన కుమార్తెను రూ.10 లక్షలకు కృష్ణన్‌కు విక్రయించింది. అయితే సుమతి తల్లి చిన్నపొన్ను ఈ విషయాన్ని పసిగట్టింది. కొద్ది రోజులుగా తన మనమరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించడంతో మొత్తం గుట్టు రట్టయ్యింది. బాలికను విక్రయించిన సుమతి, సతీష్‌కుమార్‌ను, పారిశ్రామికవేత్త కృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు