అమ్మా!.. లేమ్మా.. మరణించిన తల్లిని లేపేందుకు ప్రయత్నించిన చిన్నారి..

గురువారం, 28 మే 2020 (07:54 IST)
అమ్మా!.. లేమ్మా.. మరణించిన తల్లిని లేపేందుకు ప్రయత్నిస్తున్నాడో చిన్నారి. అప్పటి వరకు తనను కాచిన తల్లి మృత్యు ఒడిలోకి చేరిందని ఆ చిన్నారికి తెలియదు పాపం. ఆమెపై కప్పిన దుప్పటిని తొలగిస్తూ.. అల్లరి చేస్తున్నాడు.. ఈ హృదయవిదారక ఘటన చూస్తున్న ప్రతిఒక్కరి గుండె బరువెక్కుతోంది.

ఈ ఘటన పాట్నా రైల్వేస్టేషన్‌లో కనిపించింది. కంటికి రెప్పలా కాచిన తల్లి, మరణించిందని తెలియని చిన్నారి ఆమెను లేపేందుకు యత్నిస్తూ.. లేవమని అల్లరి చేస్తూ.. దుప్పటి లాగుతున్న ఈ హృదయ విదారకమైన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైలులో సోమవారం 23 ఏళ్ల మహిళ తన బిడ్డతో కలిసి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ స్టేషన్‌కు చేరుకుంది. తీవ్రమైన ఎండ, ఆకలితో శరీరం డీహైడ్రేషన్‌కు గురవడంతో.. ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఈ విషయం తెలియని చిన్నారి ఆమెను లేవమని దుప్పటిని లాగుతున్నాడు.

అదే స్టేషన్‌లో తమ చిన్నారి కూడా మరణించినట్లు మరో కుటుంబం పేర్కొంది.కరోనా వ్యాప్తి నివారణ నిమిత్తం ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ వలసకార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు వలసకార్మికులు చేస్తున్న ప్రయాణాలు మృత్యుతీరాలుగా మారుతున్నాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆహారం, నీరు అందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం అందించకపోయినా పరవాలేదు కాని ఎండాకాలం కావడంతో దాహంతో నోరు ఎండిపోతుందని, కనీసం నీరైనా అందించాలని వారు కోరుతున్నారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరువగా నమోదౌతున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు