జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడితే కాశ్మీర్లో అమలవుతున్న సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. పవిత్ర అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాశ్మీర్లో పరిస్థితులు సాధారణస్థాయికి వస్తే సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగిస్తామన్నారు. అదేసమయంలో ఈ తరహా చట్టం దేశంలో మరెక్కడా కూడా అమలు కాకూడదన్నారు.
ఇకపోతే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ఉద్దేశాలను ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసిన తర్వాత వెల్లడించారన్నారు. ఇందులోభాగంగానే పొరుగు దేశాలన్నింటితోనూ తాము స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. అందువల్ల పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవాలని రాజ్నాథ్ విజ్ఞప్తి చేశారు. కేవలం తీవ్రవాదంపైనే కాకుండా, అన్ని అంశాలపై పాకిస్థాన్ విశాలదృక్పథంతో ఆలోచన చేస్తూ ముందుకు సాగాలని కోరారు.