ప్రేమతో మోసం చేశాడు. అత్యాచారం చేశాడు. పెళ్లి మాటెత్తేసరికి చీదరించుకున్నాడు. కానీ కుల పెద్దల ఒత్తిడితో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందే గర్భం ధరించిన మహిళ.. పెళ్లైన తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన బిడ్డపై అతనికి ఏమాత్రం ప్రేమ లేదు. ఇంకా రూ.25వేలకు మరో జంటకు ఆ బిడ్డను అమ్మేశాడు. ఆపై భార్యను వేధించడం మొదలెట్టాడు. ఏడుగురు పిల్లలున్న ఓ వయసు మళ్లిన వ్యక్తికి తన భార్యను అమ్మేయాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. 2013లో ఎంబ్రాయిడరీ డిజైనర్గా పనిచేస్తున్న మహిళకు షావెజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమ- శారీరక సంబంధాల వరకు వచ్చింది. ఓ రోజు పెళ్ళి చేసుకుంటానని.. మాటిచ్చి లోబరుచుకున్నాడు. చివరికి ఆమె ప్రెగ్నెంట్ అని తేలడంతో పెళ్ళి చేసుకోనన్నాడు. బయట చెప్తే చంపేస్తానన్నాడు. ఈ వ్యవహారం కులపెద్దలకు తెలియడంతో.. పంచాయతీ పెట్టి బలవంతంగా షావెజ్ను పెళ్ళికి ఒప్పించారు.
పెళ్లయ్యాక పాప పుట్టడంతో.. పాపను వద్దనుకున్న షావెజ్ రూ.25వేలకు మరో జంటకు అమ్మేశాడు. అనంతరం ఓ ఏడుగురు పిల్లల తండ్రితో ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నాడు. విడాకుల కోసం డిమాండ్ చేశాడు. ఇలా వేధింపులను ఎదుర్కొంటున్న క్రమంలో.. బాధిత మహిళ ఇంటినుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు షావెజ్పై ఐపీసీ సెక్షన్-376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన బిడ్డను తనకిచ్చేయాలని.. షావేజ్కు తగిన శిక్ష పడాలని బాధిత మహిళ డిమాండ్ చేసింది.