దేశంలో రామరాజ్యానికి ఏర్పాటు చేయాలని తాను ఆదేశించడం కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రోడ్లు, ఫుట్పాత్ల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆక్రమణలు భారీగా ఉన్నాయని స్పష్టం చేసింది.
దేశంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని మేం ఆదేశించగలమా? అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఇంకా ఈ పిటిషన్పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం పేర్కొంది. కానీ పిటిషనర్ ఇప్పటికే ఎన్నో హైకోర్టులకు వెళ్ళామని ఈ పిటిషన్పై వాదనలను సుప్రీం వినాలని కోరడంతో.. విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
అలాగే మరో పిటిషన్ విచారణ సందర్భంగా బంకుల్లో అత్యంత దారుణంగా పెట్రో ఉత్పత్తులు కల్తీ అవడంపై స్పందించింది. పెట్రోలు బంకుల యజమానులు రాజకీయ నేతల కంటే శక్తిమంతులని సుప్రీం వ్యాఖ్యానించింది. అలాగే దురుసుగా లేకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ఇతరుల మరణానికి కారణమయ్యే నేరగాళ్లను ఐపీసీ కింద గరిష్ఠంగా రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించడం ఎంతమాత్రం సరిపోదని సుప్రీం అభిప్రాయపడింది. ఈ శిక్షను కఠినతరం చేయాలని పేర్కొంది.