ఇకపోతే, నవంబర్, డిసెంబరుల్లో తమిళనాట అత్యధిక వర్షపాతం నమోదైంది. భానుడి తాపంతో ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలను వరుణ దేవుడు కనికరించాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఈ స్థితిలో పశ్చిమ కనుమలలో బలమైన గాలులు వీస్తున్నందున ఒక వారం ముందుగానే కేరళలో వర్షాలు మొదలవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాలను కూడా తొలకరి పలకరించనుంది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత పది రోజులకు తెలంగాణ, ఏపీల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. గత రెండు సంవత్సరాల డేటా చూస్తే.. జూన్ మూడో వారానికిగానీ రుతుపవనాలు పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాలకు విస్తరించట్లేదని తెలుస్తుంది.
అలాగే.. రుతుపవనాలు కేరళను తాకి ఉత్తర దిశగా పయనిస్తున్న తరుణంలో అరేబియా సముద్రంలో అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడడం వంటివి సంభవించిన పక్షంలో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతీ రుతుపవనాల ప్రవేశం ఆలస్యం అవుతుందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.