అర్థరాత్రి చాటింగ్ వద్దన్న భర్త.. చెంప పగులగొట్టిన భార్య...

బుధవారం, 22 ఆగస్టు 2018 (09:39 IST)
సోషల్ మీడియా, ఫేస్‌బుక్ చాటింగ్‌లు పలువురి కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా అనేక మంది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరైతే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. తాజాగా అర్థరాత్రి వేళ చాటింగ్ వద్దన్న భర్తను భార్య చెంప పగులగొట్టింది. దీన్ని అవమానంగా భావించిన ఆ భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
 
గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కోట్‌లోని ఖోజా సొసైటీలో ఉంటూ వెల్డింగ్ పనులు చేసే కరీం హిరాణీ(42) రెండేళ్లుగా ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అతను భార్య, ఇద్దరు పిల్లలను చూసేందుకు వచ్చాడు. అయితే భార్య ఎప్పుడు చూసినా వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ కనిపించేది. దీంతో అతను మందలించాడు. 
 
ఆగ్రహంతో ఆమె అతనిపై చేయిచేసుకుని చెంప పగులగొట్టింది. ఈ చర్యతో కలత చెందిన కరీం హిరాణీ విషం తాగాడు. చుట్టుపక్కలవారు అతనిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దంపతుల మధ్య గతంలో కూడా అనేక వివాదాలు చోటుచేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు