సమైక్యతకు ప్రతిరూపంగా "న్యూ-ఇయర్"

WD

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో "న్యూ-ఇయర్" ఒకటి. భారతీయ సంస్కృతిలో ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు ఎక్కడా కనిపించకపోయినా... పాశ్చాత్య దేశాల ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు.

ఇందులో భాగంగా... పాత సంవత్సరానికి మంగళం పాడుతూ.. నూతన సంవత్సరానికి అందరూ సాదరంగా స్వాగతం పలుకుతారు. దేశంలోని వివిధ మత, కులాల వారితో సోదరభావంతో మెలుగుతూ... వారి వారి మతాచారాలను గౌరవిస్తూ... సమైక్య భావనతో అభినందించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రజలందరూ సమైక్యంగా ఆచరించే పండుగలలో ఈ "న్యూ ఇయర్" పండుగ ఒకటి.

ఈ పండుగను ముఖ్యంగా క్రైస్తవులు అత్యంత ప్రీతి పాత్రంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేది "క్రిస్మస్" వేడుకలతో ప్రారంభించి, డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి వరకు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. 31వ తేదీ అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు... బాణసంచాలూ కాలుస్తూ... నూతన సంవత్సరానికి శుభారంభం పలుకుతారు.

తోటి బంధుమిత్రులతో కలిసి "న్యూయర్ కేక్" కట్ చేసి వాటిని పంచుకుంటూ, ఒకరికొకరు కరచాలనం చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాలకు సర్వ శుభాలను అందివ్వాలని ఆకాంక్షిస్తూ ఒకరినొకరు అభినందించుకుంటారు.

క్రైస్తవులు మాత్రమే జరుపుకునే ఈ పండుగను నేడు మహత్తరంగా జరుపుకుంటున్నారు. న్యూ-ఇయర్ ప్రారంభం (డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల వరకు) ప్రత్యేక వేడుకలు, పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లి బంధుమిత్రులతో ఉత్సాహంగా గడపడం, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడం చేస్తున్నారు.

మరోవైపు... నూతన సంవత్సరం సందర్భంగా అన్ని మతాలకు చెందిన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వివిధ మతాలకు చెందిన వారు సమైక్యభావంతో కొత్త సంవత్సరంలో తమకు అన్నీ అనుకూలించాలని ఆకాంక్షిస్తూ ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేపడుతున్నారు.

మరికొందరు... నూతన సంవత్సర శుభారంభంలో గత సంవత్సరంలో దొర్లిన తప్పిదాలను సరిదిద్దుకోవాలని ప్రతిజ్ఞలు చేసి, వారి లోపాలను సరిదిద్దుకుంటారు. వారి వారి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఇది ఒక చక్కని శుభదినంగా భావించి కొత్త కొత్త పొదుపు మార్గాలను ఈ రోజుతో ప్రారంభించి వారి కుటుంబ భవిష్యత్తుకు పూలబాట వేసుకుంటారు.

ప్రపంచదేశాల్లోని పలు ప్రధాన నగరాల్లో న్యూ-ఇయర్ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా.. లండన్‌లోని థేమ్స్ నదీతీర సమీపంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 అర్థరాత్రి ఈ వేడుకలు జరుగుతాయి. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రంగు రంగుల బాణసంచాలను కాలుస్తూ.. ఆకాశంలో ఇంద్రధనుస్సు సృష్టిస్తారు. సంగీత కార్యక్రమాలు జరిపి.. కొత్త సంవత్సరాన్ని శుభారంభంగా ఆహ్వానిస్తారు. అన్నిదేశాల్లో న్యూ-ఇయర్ ప్రారంభమయ్యే రోజును సెలవు దినంగా ప్రకటించారు.

ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ... సుఖసంతోషాలతో గడపాలని ఆశిద్దాం...!

వెబ్దునియా పై చదవండి