మొదట గోంగూరను తొడిమల ఒలుచుకుని శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి. మరో వైపు రొయ్యలను కూడా పొక్కులు తీసి బాగా శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్ గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు అందులోనే ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుని పది నిమిషాల పాటు పెద్ద మంట మీద బాగా ఉడికించి చివరిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. అంతే రుచికరమైన గోంగూర రొయ్యల కూర రెడీ. గోంగూర అంటే ఇష్టపడేవారు కేవలం పచ్చళ్లుగానే కాకుండా ఈ విధంగా సీ ఫుడ్గా కూడా వండుకుని ఆరగించవచ్చు.