అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయనున్న కేంద్రం

FILE
విదేశాలకు అక్రమ వలసలను అరికట్టేందుకుగానూ ఏడంచెల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రవాస వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో రెండు రోజులపాటు నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రవాస భారతీయులు, చట్టబద్ధ వలసదారుల ప్రయోజనాలు కాపాడే విధంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని ప్రవాస వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సమావేశం ప్రకారం... క్రింది స్థాయిలోనే మోసాలను అరికట్టే విధంగా తగు చర్యలను చేపడతామనీ... మధ్యవర్తులు, ఏజెంట్లపై జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా నిఘా పెట్టి, మోసాలకు పాల్పడే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ వివరించింది.

అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను విమానాశ్రయాలు, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల వద్ద ఉంచుతారనీ ప్రవాస వ్యవహారాల శాఖ ప్రకటన పేర్కొంది. ఆ విధంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కోర్ గ్రూపును కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఇదే సందర్భంగా.. 2010లో జరుగనున్న ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొనాల్సిందిగా ఆయా రాష్ట్రాలకు ఈ శాఖ ఆహ్వానం పలికింది.

వెబ్దునియా పై చదవండి