అధికారులు, పోలీసు వర్గాలతో ఎన్నారైల భేటీ

ఆస్టేలియాలోని భారత సంతతికి చెందిన నాయకులు, అక్కడి సీనియర్ క్వీన్స్‌లాండ్ అధికారులను మరియు పోలీసు వర్గాలను కలిశారు. ఆ దేశంలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల విషయమై ప్రస్తుత పరిస్థితిని, తీసుకుంటున్న చర్యల గురించి ఎన్నారై నాయకులు అధికారులు, పోలీసులతో సుదీర్ఘంగా చర్చించారు.

హానరీ కాన్సుల్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ సర్వదమన్ సింగ్ నేతృత్వంలోని ఎన్నారైల బృందం... క్వీన్స్‌లాండ్ రాజధాని అయిన బ్రిస్బేన్‌‌లో ఉంటున్న పార్లమెంటరీ స్పీకర్ జాన్ మైకెల్, కమ్యూనిటీ మంత్రి అన్నాస్టాసియా పాలసుజుక్, విద్యాశాఖా మంత్రి జియోఫ్ విల్సన్ మరియు పోలీసు అధికారులను కలిసింది. ఈ సందర్భంగా వీరు, క్వీన్స్‌లాండ్ చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న 12 వేల మంది భారతీయుల భద్రత గురించి విపులంగా చర్చించారు.

ఈ సందర్భంగా క్వీన్స్‌లాండ్ అసిస్టెంట్ కమీషనర్ లాన్ స్టేవార్ట్ మాట్లాడుతూ... ప్రస్తుతం భారతీయులపై ఎలాంటి దాడులు జరగటం లేదని అన్నారు. ఇదే సందర్భంగా సర్వదమన్ సింగ్ మాట్లాడుతూ... ఆస్ట్రేలియా ఉత్తర, దక్షిణ రాష్ట్రాలలో ఎక్కడైనా దాడులు జరుగుతున్నట్లయితే, మరే ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నా వెంటనే తమ దృష్టికి తేవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియా అధికారుల కథనం ప్రకారం, ఇప్పటిదాకా మెల్‌బోర్న్, సిడ్నీ ప్రాంతాలలో 14 మంది భారతీయులు దాడులకు గురయినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగిందనీ, భారతీయుల భద్రత గురించి తాము అన్నిరకాల జాగ్రత్తలను తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి