ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అమెరికాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మే 23వ తేదీన టెక్సాస్లోని ఇర్వింగ్లో, 24న టెన్నిసీలోని నాష్విల్లేలలో సంబరాలు జరిపేందుకు వైఎస్సార్ యువసేన ఏర్పాట్లను మమ్మురం చేసింది.
కాగా... ఈ వేడుకల్లో భాగంగా భారీ ఎత్తున కారు ర్యాలీని నిర్వహించనున్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ తిరిగీ ఎన్నిక కావడం, లోక్సభ సభ్యుడిగా ఆయన కుమారుడు జగన్ ఎన్నిక కావడంతో... వైఎస్సార్ యువసేన ఈ సంబరాలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు యువసేన అమెరికా కమిటీ సలహాదారు మునగాల బ్రహ్మానందరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
విజయోత్సవ సంబరాలకు భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరుకావాలని.. వైఎస్సార్ యువసేన అమెరికా కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్సార్ సర్కార్, మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టి, విజయపథంలో ముందుకెళ్తుందని ఆయన ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.