ఆగని దాడులు : మరో విద్యార్థిపై పంజా

FILE
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల పరంపరకు అడ్డుకట్ట పడే మార్గమే కనిపించటం లేదు. తాజాగా ఇండోర్‌కు చెందిన మోహిత్ మంగళ్ అనే భారతీయ విద్యార్థిపై నలుగురు ఆస్ట్రేలియా యువకులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు.

సిడ్నీలోని ఓ షాపింగ్ మాల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న మోహిత్ మంగళ్‌పై దుండగులు బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. కాగా.... ఆ షాపింగ్ మాల్‌లో సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహిత్‌ తలపై దుండగులు బీరు సీసాలతో పగులగొట్టారు. అంతేగాకుండా, బేస్‌బాల్ బ్యాటుతో అతడిని తీవ్రంగా గాయపరిచారు.

ఈ విషయమై మోహిత్ తండ్రి అనిల్ మంగళ్ మీడియాతో మాట్లాడుతూ... జాత్యహంకారుల దాడి నుంచి తమ కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు. అయితే తన కుమారుడికి శత్రువులెవరూ లేరనీ, ఇది ఖచ్చితంగా జాత్యహంకారుల మూర్ఖత్వంవల్లనే ఈ దాడి జరిగి ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... ఆసీస్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశంలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణ... అక్కడి రక్షణ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన రెండు రోజుల్లోపే మరో జాత్యహంకార దాడి జరగటం దురదృష్టకరమైన పరిణామం. ఓ వైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా, మరోవైపు విద్యార్థులపై దాడులు రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి