ఆదుకుందాం రండి : "ప్రవాస చిరు ఆర్గ్" పిలుపు

FILE
ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో సరస్వం కోల్పోయిన తెలుగు ప్రజానీకానికి సహాయం అందించేందుకు ప్రవాస భారతీయులు ఉదారంగా ముందుకు రావాలని వాషింగ్టన్‌లోని "ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్" పిలుపునిచ్చింది. భారీ వర్షాలు, భీకరమైన వరదలు రాష్ట్రంలో ఏడు జిల్లాలను వారం రోజులపాటు ముంచెత్తి.. ఆయా గ్రామాలను, పట్టణాలను కన్నీటి సంద్రాలుగా మార్చి వేశాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

వరదల్లో కట్టుబట్టలతో మిగిలిన ప్రజలకు ముందుగా ఆహారం, మంచినీరు, వైద్య సదుపాయం అందించాల్సిన ఆవశ్యకతను ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ముందుగా గుర్తించింది. ఈ మేరకు ఎన్ని ఎక్కువ కుటుంబాలకు వీలైతే అంత అధిక మొత్తంలో ప్రత్యక్షంగా సహాయం చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది.

అయితే వరద ముంపునకు గురైన ప్రాంతాలలో సమర్థవంతంగా సహాయ సహకారాలను అందించేందుకు ప్రవాసాంధ్రుల చేయూత కూడా ఎంతో అవసరమని చిరంజీవి ఆర్గనైజేషన్ విజ్ఞప్తి చేసింది. వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చే ప్రవాసాంధ్రులు.. ఆయా మొత్తాలను తమ సంస్థకు అందించాలని ఆ సంస్థ కోరింది.

ఇలా వసూలైన మొత్తాన్ని వరద సహాయ కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తామని.. ఒక్క డాలర్ దగ్గర్నించి ఎంత వీలయితే అంత మొత్తంలో అయినా సహాయం అందించాలని చిరు ఆర్గనైజేషన్ కోరింది. మరిన్ని వివరాల కోసం తమ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని ఆ సంస్థ కార్యవర్గం ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి