ఆస్ట్రేలియాలోని వివిధ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు.. అక్కడి స్వైన్బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వైస్ ఛాన్స్లర్ జెఫ్రీ స్మార్ట్ పేర్కొన్నారు. తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు, వారి తల్లిదండ్రులు అడిగే సందేహాల నివృత్తి కోసం ఈ హెల్ప్లైన్ 24 గంటలపాటు ఉచితంగా సేవలను అందిస్తుందన్నారు.
హైదరాబాదులోని తాజ్కృష్ణా హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో "ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల చదువులు, భద్రత" అనే అంశంపై ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జెఫ్రీ స్మార్ట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఆసీస్లో జరిగిన పలు సంఘటనల దృష్ట్యా ఈ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
విశ్వవిద్యాలయాల క్యాంపస్లలో ఒక టీంను ఏర్పాటు చేసి అక్కడి విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించే విధంగా చర్యలు చేపట్టినట్లు స్మార్ట్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవల అక్కడ జరిగిన సంఘటనలు, అక్కడి వాతావరణంపై సరైన అవగాహన లేకపోవడంవల్లనే జరిగాయే తప్ప జాతి వివక్ష సమస్య కాదని.. ఇదే సమావేశంలో పాల్గొన్న స్వైన్బర్న్ వర్సిటీ విద్యార్థి సచిన్ పోద్దార్ వ్యాఖ్యానించటం గమనార్హం.