ఆసీస్‌లో భారత్ ఉత్సవం "పార్రామసాలా"

FILE
భారతీయులపై యధేచ్చగా జాత్యహంకార దాడులకు తెగబడుతున్న ఆస్ట్రేలియాలో "పార్రామసాలా" పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో వారం రోజులపాటు జరుగనున్న ఈ భారత్ ఉత్సవం కళలు, సంగీతం మేళవింపుగా కనువిందు చేయనుంది. అందుకే ఈ ఉత్సవానికి "పార్రామసాలా" అని పేరు పెట్టారు.

భారత్ ఉత్సవానికి వేదిక కానున్న సిడ్నీ నగరంలోని పార్రామట్టా ప్రాంతం పేరును కలుపుని "పార్రామసాలా" అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది. పార్రామట్టా వాసుల్లో 8,100 మంది భారత్‌లో పుట్టినవారే కావటం విశేషంగా చెప్పవచ్చు. భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో జరుపుకునే దీపావళి పండుగ రోజుల్లో "పార్రామసాలా"ను నిర్వహించనుండటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. పార్రామసాలా ఉత్సవం ఈ ఏడాది నవంబర్ 4 నుంచి 10 వరకు జరుగనుంది. ఈ ఉత్సవానికి భారతీయులు భారీ సంఖ్యలో హాజరుకాగరనీ, తద్వారా రాష్ట్రానికి 50 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతుందని న్యూసౌత్‌వేల్స్ ప్రధానమంత్రి క్రిస్టినా కెనియల్లీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. భారతీయులపై ఎడతెగకుండా జరుగుతున్న దాడుల నేపథ్యంలో జరుగున్న పార్రామసాలాకు భద్రతా ఏర్పాట్లపై అధికారులు స్థానిక భారతీయులతో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి