ఆస్ట్రేలియాలో హత్యకు గురైన మూడేళ్ల చిన్నారి గుర్షన్ సింగ్ చన్నాకు సోమవారం అతని స్వగ్రామం పంజాబ్లోని కోట్కపురాలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. వందలాది ప్రజలు కాలినడకన గుర్షన్ ముతృదేహంతోపాటు స్మశానానికి తరలివెళ్లి అంత్యక్రియలను నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
ఆస్ట్రేలియా నుంచి ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చిన గుర్షన్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులు నేరుగా తమ స్వగృహానికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి ప్రధాన వీధులగుండా దగ్గర్లోని రామ్బాగ్ స్మశానవాటికకు తరలించారు. ఈ సందర్భంగా వందలాది ప్రజలు గుర్షన్ మృతదేహం వెంట నడిచి, ఆ చిన్నారికి వీడ్కోలు పలికారు.
బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు, సీనియర్ ఆఫీసర్లు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులు తదితరులు గుర్షన్ మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిక్కుమత ప్రార్థనల అనంతరం గుర్షన్ మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలోని పర్యాటక కేంద్రాలను తిలకించేందుకు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన గురుషాన్ కొన్నిరోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ ఎయిర్పోర్టుకు సమీపంలోని అక్లాండ్ జంక్షన్, వైల్డ్వుడ్ రోడ్డులో ఈ బాలుడి శవం పడివుండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించిన సంగతి విదితమే.