ఆస్ట్రేలియాలో యువకుల మధ్య గతవారం జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి శ్రావణ్కుమార్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని ఈ దాడినుండి తృటిలో తప్పించుకున్న అతని మిత్రుడు శ్రీనివాస్ గాంధీ తెలిపారు.
శ్రావణ్ ఖమ్మం జిల్లా ముచ్చెర్ల వాసి. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన ముగ్గురిని డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డబ్బులు ఇవ్వనందుకే తన కొడుకుపై అక్కడి వారు దాడిచేశారని శ్రావణ్ తండ్రి చిదంబరం ఆరోపిస్తున్నారు.
ఇదిలావుండగా జాతి వివక్షతోనే ఈ దాడి జరిగిట్లు తెలుస్తోంది. వీకెండ్ పార్టీలోనున్న తమవద్దకు కొందరు యువకులు వచ్చి దూషించారని, ఇండియాకు తిరిగి వెళ్ళిపోవాలని వారు బెదిరించి తమను గాయపరిచారని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
కాగా రెండు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం సిడ్నీ వచ్చిన శ్రావణ్ కుమార్ కేంబ్రిడ్జ్ అంతర్జాతీయ కాలేజీలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు, పోలీసులు సైతం తగిన స్వీయ రక్షణ లేకుండా బయటకు వెళ్ళవద్దని చెబుతున్నారని బాధితులు ప్రస్తావించారు.