ఇటలీలో పంజాబ్ యువకుడి మృతి

పంజాబ్‌కు చెందిన రమేష్ కుమార్ అనే 27 సంవత్సరాల యువకుడు ఇటలీలోని మిలాన్ నగరంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 2007లో ఇటలీకి వలస వెళ్లిన కుమార్, మిలాన్ నగరంలోని టింబర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కాగా.. జూలై 28వ తేదీన అనుమానాస్పద రీతిలో స్థానిక నది ఒడ్డున శవమై కనిపించాడు. దీంతో తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు అతడి కుటుంబ సభ్యులు అక్కడి ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

ఈ సందర్భంగా కుమార్ తండ్రి మందన్ లాల్ మాట్లాడుతూ... తన కొడుకు హత్యకు గురయి ఉండవచ్చునేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఇటలీలోనే ఉండే తమ బంధువుల ద్వారా ఈ వార్త తెలిసిందని, విచారణ పూర్తయ్యేదాకా మృతదేహాన్ని అప్పగించమని ఇటలీ పోలీసులు చెప్పారని ఆయన భోరున విలపించాడు.

కుమార్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు జోక్యం చేసుకోవాలని తమ నియోజకవర్గ ఎంపీ, విదేశాంగ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు మందన్ లాల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే... పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో దేరబాసి పట్టణం ఉంటుంది. ఈ పట్టణంలోనే కుమార్ తల్లిదండ్రులు నివసిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి