ఊపందుకున్న "తానా" మహాసభల ఏర్పాట్లు

తెలుగుజాతి వైభవాన్ని ప్రపంచం నలుమూలలకూ చాటుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తన 17వ మహాసభల ఏర్పాట్లను మమ్మురం చేసింది. జూలై 2 నుంచి 4 వరకు చికాగోలో జరుగనున్న ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు తానా నిర్వాహక కమిటీ ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేసింది.

ఈ మేరకు సభలు జరిగే రోజ్‌మాంట్ కన్వెన్షన్ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్సవాలకు ఇల్లినాయిస్ గవర్నర్ పాట్ క్విన్, ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వయలార్ రవి, ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖా మంత్రి గల్లా అరుణ కుమారి, అమెరికాలోని భారత రాయబారి మీరాశంకర్‌లు హాజరు కానున్నారని తానా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు.

అలాగే... చికాగో కాన్సుల్ జనరల్ అశోక్ కుమార్ ఆత్రి, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ సుస్మితా జి. థామస్ తదితరులు కూడా ఈ మహాసభలకు హాజరవనున్నారని ప్రభాకర్ చౌదరి వివరించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహాసభలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుకోగోరువారు తమ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చునని చౌదరి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి