భారత సంతతికి చెందిన రచయిత మోయెజ్ గులామ్హుస్సేన్ వాసన్జీకి అరుదైన గౌరవం దక్కింది. 59 సంవత్సరాల వాసన్జీ తాను రచించిన "ఏ ప్లేస్ వితిన్: రీ డిస్కవరింగ్ ఇండియా" అనే నవలకు నాన్ఫిక్షన్ విభాగంలో ప్రతిష్టాత్మక "గవర్నర్ జనరల్ సాహిత్య అవార్డు"కు ఎంపికయ్యారు.
కాగా.. కెనడా గవర్నర్ జనరల్ మిషెల్లీ జీన్ చేతుల మీదుగా వాసన్జీ ఈ సాహిత్య అవార్డును అందుకున్నారు. ఫిక్షన్, పొయెట్రీ, డ్రామా, పిల్లల సాహిత్యం, అనువాదం తదితర విభాగాల్లో కూడా గవర్నర్ అవార్డులను ప్రదానం చేశారు. ఇదిలా ఉంటే.. కెనడా ప్రతిష్టాత్మక అవార్డును గెల్చుకున్న వాసన్జీకి ఇండో-అమెరికన్ లీడర్షిప్ కాన్ఫెడరేషన్ ఛైర్పర్సన్ రాజన్ జెడ్ అభినందనలు తెలియజేశారు.
ఇదే సందర్భంగా రాజన్ జెడ్ నెవడాలో విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ఉత్తర అమెరికాలోని భారత జాతి వాసన్జీని చూసి గర్విస్తోందనీ, భావి ప్రవాస రచయితలకు వాసన్జీ మార్గదర్శకుడిగా నిలవాలని కోరారు. అదే విధంగా వాసన్జీ మరిన్ని గొప్ప గొప్ప రచనలు చేయాలన్ని, మరెన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకోవాలని రాజన్ ఆకాంక్షించారు.
1950లో కెన్యాలో జన్మించిన వాసన్జీ టాంజానియాలో పెరిగారు. ధియరీటికల్ న్యూక్లియర్ ఫిజిస్ట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన 1978లో కెనడాకు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఆయన రాసిన అనేక రచనలకుగానూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అదే విధంగా రెండుసార్లు గిల్లర్ బహుమతిని సైతం అందుకున్నారు.