ఐర్లాండ్‌లో భారతీయ కుటుంబాలపై దాడులు

FILE
ఇప్పటికే ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులతో భారతీయులు సతమతమవుతుండగా.. మరోవైపు ఉత్తర ఐర్లాండ్‌‌కు కూడా ఈ సంస్కృతి వ్యాపించినట్లు అర్థమవుతోంది. ఈ దేశంలోని పోర్టాడౌన్ అనే నగరంలో నివసిస్తున్న రెండు భారతీయ కుటుంబాలపై జాత్యహంకార దాడులు జరగటాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పైగా ఈ రెండు కుటుంబాలూ మలయాళీలవే కావడం గమనార్హం.

కేరళ ప్రాంతానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఉంటున్న ఇంటిపై రాత్రిపూట దాడి చేసిన దుండగులు కింది అంతస్తులోని కిటికీలను బద్ధలుకొట్టి లోనికి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో బాధితుడు, అతడి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుడి భార్య నర్సుగా పనిచేస్తుండటంతో దాడి జరిగిన సమయంలో ఆమె రాత్రిపూట విధుల్లో ఉన్న కారణంగా తప్పించుకుంది. దాంతో భీతిల్లిన సదరు మలయాళీ కుటుంబం వారంలోగానే ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి మారిపోయింది.

ఇదే పట్టణంలోని మరో మలయాళీ కుటుంబం కూడా ఇలాంటి దాడికే గురయ్యింది. ఇంటి కిటికీలు మూడింటిని బద్ధలుకొట్టిన దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ కుటుంబ యజమాని... కేరళ నుంచి ఇక్కడి వచ్చిన తాము స్థానికులతో చాలా స్నేహభావంతో ఉంటున్నప్పటికీ తమపై దాడి జరగటం చాలా బాధ కలిగిస్తోందని వాపోయారు. తాము సురక్షితమైన ప్రాంతంలో వేరే ఇల్లు చూసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... ఐర్లాండ్‌ దేశానికి మచ్చ తెచ్చే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సౌత్ బెల్‌ఫాస్ట్ ఎమ్మెల్యే ఆనా లో వ్యాఖ్యానించారు. అయితే రెండు దాడులూ ఒకే బృందం చేసినవి కావచ్చని, వలస వచ్చిన కుటుంబాలు దాడుల కారణంగా ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తటం సిగ్గుచేటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వలస కుటుంబాల రక్షణ కోసం వారు నివసించే ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేయాల్సిందిగా తాను పోలీసులను కోరతారని ఈ సందర్భంగా ఆమె హామీనిచ్చారు.

వెబ్దునియా పై చదవండి