కిరణ్ హత్యపై దర్యాప్తుకై భారత్ డిమాండ్

దక్షిణాఫ్రికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్ హత్యపై దర్యాప్తు జరిపించాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కిరణ్ హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జోహెన్నెస్‌బర్గ్ నగర పోలీసు కమీషనర్‌ను కోరినట్లు దక్షిణాఫ్రికాలోని భారత ఉప రాయబారి అరవింద నాన్వెల్ వెల్లడించారు.

ఈ విషయమై అరవింద మాట్లాడుతూ... కిరణ్ హత్యోదంతాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం దృష్టికి తేవాలని తాము కోరినట్లు తెలిపారు. కిరణ్‌పై జరిగిన దాడి వెనుక జాతి వివక్ష ఉందని అనుకోవడం లేదని, కేవలం దోపిడీ చేసేందుకే దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు.

ఈ దేశంలో గతంలో కూడా భారతీయులపై చిన్నపాటి దాడులు జరిగాయని, అయితే అలాంటి దాడుల్లో చనిపోవడం మాత్రం ఇదే మొదటిసారని అరవింద పేర్కొన్నారు. కిరణ్ మృతదేహం స్వదేశానికి తరలించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే... వరంగల్ జిల్లా ఆరెపల్లికి చెందిన కిరణ్‌పై దుండగులు కాల్పులు జరిపి... ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే...!

వెబ్దునియా పై చదవండి