"జాక్సన్"పై బ్రిటన్ ఎన్నారై ఎంపీ తీర్మానం

పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ ఆకస్మిక మృతిపై బ్రిటన్‌లోని భారత సంతతి ఎంపీ కెయిత్‌వాజ్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోని సరిహద్దులను చెరిపివేస్తూ, ప్రజలను ఏకంచేసి, జాతివివక్షను పారద్రోలేందుకు జాక్సన్ సంగీతం కృషి చేసిందని కీర్తిస్తూ... "యూకే హౌజ్ ఆఫ్ కామన్స్"లో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కామత్ మాట్లాడుతూ... తానోసారి జాక్సన్‌ను కలిశానని, ఆయన మరణం సంగీత ప్రియులందరినీ విషాదంలో పడవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాక్సన్ తరంలో విజయవంతమైన పాప్ సంగీతకారుడే కాకుండా, తన సంగీతంతో లక్షలాదిమంది అభిమానాన్ని చూరగొన్నాడని అన్నారు. ప్రపంచవ్యాప్త ప్రజలు జాతి, ప్రాంత వివక్షతలను మరచి ఒక్కటయ్యేందుకు ఆయన సంగీతం ఎంతగానో తోడ్పడిందని పై తీర్మానంలో కామత్ ప్రస్తావించారు.

అంతేగాకుండా, జాతి వివక్షలను సవాల్ చేస్తూ.. విభిన్న సంస్కృతుల ప్రజలను తన గానంతో ఏకం చేసిన జాక్సన్ ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మేరకు అమ్ముడయ్యాయని, ఏడు గ్రామీ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నాయని ఈ సందర్భంగా కామత్ వివరించారు. ఎన్నో రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ పాప్ రారాజు స్ఫూర్తిని ఆయన అభిమానులందరూ కొనసాగిస్తారని కామత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి