జాత్యహంకార దాడులను సహించేది లేదు : బ్రంబీ

FILE
జాత్యహంకార దాడులను సహించబోమని, విదేశీ విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని.. విక్టోరియా రాష్ట్ర ప్రధాని జాన్ బ్రంబీ స్పష్టం చేశారు. జాతి వివక్ష దాడులను అణచివేసేందుకు తమ రాష్ట్ర పోలీసులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టామని ఆయన తెలిపారు.

న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని బ్రంబీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ విద్యార్థులపై దాడుల నివారణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దాడులు ఇకపై పునరావృతం కాబోవని తమ ప్రభుత్వం, విక్టోరియా రాష్ట్ర ప్రజల తరపున విద్యార్థులకు బ్రంబీ భరోసా ఇచ్చారు

అలాగే జాతి వివక్ష దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోందని బ్రంబీ వెల్లడించారు. అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ తర్వాత ఆయన ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా బ్రంబీ ముంబై పర్యటనను రద్దు చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి