డంకన్ లెవీస్ అధ్యక్షతన "టాస్క్‌ఫోర్స్" ఏర్పాటు

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులపై... ఆ దేశ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. దాడులను అరికట్టేందుకు జాతీయ భద్రతా సలహాదారు డంకన్ లెవీస్ అధ్యక్షతన ఓ "టాస్క్‌ఫోర్స్"ను ఏర్పాటు చేసినట్లు, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్ ఆ దేశ పార్లమెంటులో వెల్లడించారు.

ఈ సందర్భంగా స్మిత్ మాట్లాడుతూ... భారతీయ విద్యార్థులపై దాడులకు పాల్పడిన దుండగులను శిక్షించేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తాము ఏర్పరిచిన టాస్క్‌ఫోర్స్‌లో విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, విద్య, వలసలు, పౌరసత్వం, న్యాయశాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు.

ఈ టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే తొలి సమావేశాన్ని నిర్వహించినట్లు స్మిత్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఇదిలా ఉంటే... స్మిత్ టాస్క్‌ఫోర్స్ గురించి పార్లమెంటులో ప్రకటించి, కొద్ది గంటలు గడవక మునుపే.. అక్కడ నర్దీప్ సింగ్ అనే నర్సింగ్ విద్యార్థిపైన, ఆశిష్ సూద్ అనే మరో విద్యార్థిపైన దుండగులు దాడులకు పాల్పడటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి