దాడులను పూర్తిగా అరికట్టలేం: ఆస్ట్రేలియా హై కమీషనర్

FILE
భారతీయ విద్యార్థుల భద్రతకు తమ దేశం అన్నిరకాల చర్యలనూ తీసుకుంటోందని ఆస్ట్రేలియా హైకమీషనర్ పీటర్ వర్గీజ్ న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. అయితే నేరాలను, ప్రజల్లో నెలకొన్న తిరస్కరణ భావాన్ని మాత్రం తాము పూర్తిగా నివారించలేమని ఆయన పేర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోని ఏ దేశానికి కూడా అది సాధ్యం కాకపోవచ్చునని వర్గీజ్ అభిప్రాయపడ్డారు.

భారతీయ విద్యార్థులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని వర్గీజ్ వివరించారు. సరైన భద్రత లేదన్న కారణంతో తమ దేశానికి వచ్చే భారతీయుల సంఖ్య తగ్గిందన్న విషయం గూర్చి తాను మాట్లాడబోయేది లేదని.. విదేశీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

భద్రతా కారణాలే కాకుండా ఆర్థికమాంద్యం, నివాస ఖర్చులు పెరగటంలాంటివి కూడా తమ దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు కారణాలుగా ఉన్న విషయాన్ని మర్చిపోరాదని వర్గీజ్ అన్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థుల సంఖ్య 30 వేల నుంచి లక్షదాకా పెరిగిందని తెలిపారు.

ఇదిలా ఉంటే.. గత కొన్ని నెలలుగా ఆసీస్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు పెరగటంపట్ల పీటర్ వర్గీజ్ ఆందోళన వ్యక్తం చేశారుయ అయితే అన్ని సంఘటనలకూ జాతివివక్షను అంటగట్టి చూడకూడదన్నారు. తాజాగా జరిగిన నితిన్ హత్య అమానుషమనీ పేర్కొన్న ఆయన.. సరైన ఆధారాలు లేకుండా దాన్ని జాత్యహంకార హత్యగా చెప్పలేమన్నారు.

వెబ్దునియా పై చదవండి